రాజకీయాల్లో ఉన్నంత వరకు చంద్రబాబుతోనే:గంటా

రూ.17 వేల కోట్ల లోటు బడ్జెట్‌తో నవ్యాంధ్ర ప్రస్థానం ప్రారంభమైందని.. ఈ ఐదేళ్లలో ఎదురైన ప్రతి సంక్షోభాన్నీ సీఎం చంద్రబాబు ఒక సవాలుగా స్వీకరించారని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. రూపాయి చెల్లించకుండా రాజధాని కోసం 33 వేల ఎకరాలు సేకరించిన గొప్ప నేత అని కొనియాడారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా తెదేపాలో చేరిక సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గంటా మాట్లాడారు. త్వరలో జరగబోయే ఎన్నికలు అవినీతికి, అనుభవానికి మధ్యేనని చెప్పారు. తాను పార్టీ మారుతున్నానంటూ వెలువడుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. వైకాపా నిత్యం మైండ్‌గేమ్‌ ఆడుతోందని ఆరోపించారు. ఒక నీతి, నియమం, విలువల్లేకుండా దిగజారుడు రాజకీయాలు చేస్తోందని దుయ్యబట్టారు. తాను జగన్‌తో భేటీ అయినట్లు.. ముహూర్తం కూడా ఖరారైనట్లు వార్తలు ప్రసారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా ప్రతినిధులు వైకాపా ట్రాప్‌లో పడొద్దని.. ఏదైనా అనుమానం వస్తే తనను సంప్రదిస్తే సమాధానం చెబుతానన్నారు. రాజకీయాల్లో ఉన్నంత వరకు చంద్రబాబు నాయకత్వంలోనే పనిచేస్తానని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఇప్పటికే చాలాసార్లు చెప్పానని.. ఒకవేళ అలాంటి పరిస్థితే వస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతానని గంటా అన్నారు. 

Leave a Response