సంబరాల్లో వైకాపా‌.. జగన్‌కు అభినందనల వెల్లువ

ఏపీలో వైకాపా దూసుకుపోతోంది. మెజారిటీ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అధికార తెదేపా చతికిలపడింది. ఇప్పటివరకూ వెలువడిన ఫలితాల ప్రకారం.. వైకాపా 140కిపైగా స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తుండగా.. తెదేపా ఆధిక్యం 30 స్థానాలకు మాత్రమే పరిమితమైంది.రాష్ట్రంలో వైకాపా హవా కొనసాగుతుండటంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌ను పలువురు నేతలు కలిసి అభినందనలు చెబుతున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని జగన్‌ నివాసానికి  వచ్చిన ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆయన్ని కౌగిలించుకొని అభినందనలు తెలిపారు. తన నివాసం నుంచి ఎన్నికల ఫలితాలను టీవీలో వీక్షిస్తున్న జగన్‌తోపాటు పలువురు పార్టీ నేతలు ఉన్నారు. ఈ సందర్భంగా జగన్‌ నివాసం వద్ద పండగ వాతావరణం నెలకొంది. అటు లోక్‌సభ ఎన్నికల్లోనూ వైకాపా దూసుకుపోతుంది. ఇప్పటి వరకూ 23 స్థానాల్లో ఫ్యాన్‌ హవా కొనసాగుతుండగా.. తెదేపా రెండు స్థానాల్లో ముందంజలో ఉంది.

Leave a Response