జగన్‌ విజయం ……..

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల్లో వైకాపా దూసుకెళ్తోంది. 150కి పైగా స్థానాల్లో ఆపార్టీ అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా వైకాపా సీనియర్‌నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 30న జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని తెలిపారు. ఎల్లుండి వైకాపా శాసనసభాపక్ష సమావేశం ఉంటుందని వెల్లడించారు. చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ పేరుతో ప్రభుత్వ సొమ్మును పంచిపెట్టి ఓట్లు పొందాలని చూశారని, అయినా ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పలేదని ఉమ్మారెడ్డి విమర్శించారు.సార్వత్రిక ఎన్నికల్లో అద్భుత విజయాన్ని ముందుగానే ఊహించామని వైకాపా అధ్యక్షుడు జగన్‌ అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన నివాసం నుంచి ఎన్నికల ఫలితాలను వీక్షిస్తున్న జగన్‌.. జాతీయ మీడియాతో మాట్లాడారు. రాహుల్‌గాంధీ గురించి ఇప్పుడే ఏం మాట్లాడనని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. 150 అసెంబ్లీ స్థానాల్లో, 24 ఎంపీ స్థానాల్లో వైకాపా అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. మరో వైపు జగన్‌కు శుభాకాంక్షలు తెలిపేందుకు వైకాపా శ్రేణులు భారీగా తరలివస్తున్నారు. వైకాపా నాయకులు, కార్యకర్తలతో తాడేపల్లిలో సందడి నెలకొంది.

Leave a Response