అవలీలగా డబుల్ సెంచరీ..

టీమిండియా యువ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ తన సూపర్ ఫామ్ ను కొనసాగిస్తూ మరోసారి అవలీలగా డబుల్ సెంచరీ నమోదు చేశాడు. బంగ్లాదేశ్ తో ఇండోర్ లో జరుగుతున్న మొదటి టెస్టులో మయాంక్ 200 పరుగుల మైలురాయిని అధిగమించాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ లో ద్విశతకం నమోదు చేసిన ఈ రైట్ హ్యాండర్ తాజాగా బంగ్లా బౌలర్లను ఉతికారేస్తూ తొలి ఇన్నింగ్స్ లో అద్వితీయ రీతిలో డబుల్ సెంచరీ తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం మయాంక్ స్కోరు 210 పరుగులు కాగా, వాటిలో 25 ఫోర్లు, 6 సిక్సులున్నాయి.అంతకుముందు, అజింక్యా రహానే 86 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటై సెంచరీ చేజార్చుకున్నాడు. ప్రస్తుతం మయాంక్ కు తోడుగా రవీంద్ర జడేజా (13) క్రీజులో ఉన్నాడు. టీమిండియా స్కోరు 4 వికెట్లకు 374 పరుగులు. తొలి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ 150 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.

Leave a Response