విద్యార్థుల ఆత్మహత్యలు కలచివేశాయి…చంద్రబాబు నాయుడు

‘పరీక్షల్లో తప్పామని తెలంగాణలో 16 మంది ఇంటరు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు వెలువడుతున్న వార్తలు బాధ కలిగించాయి. ఉజ్వల భవిష్యత్తు ఉన్న విద్యార్థుల మరణం నన్ను కలచివేసింది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న రాత్రి ట్వీట్‌ చేశారు. ‘విద్యార్థులకు  నా విజ్ఞప్తి ఒక్కటే. పరీక్షల్లో పాస్‌ కావడం మాత్రమే జీవితం కాదు. అవి మీ ప్రతిభకు గుర్తింపు మాత్రమే. పరీక్షల కంటే మీ జీవితాలు ముఖ్యం. ప్రాణాలు అంతకంటే అమూల్యం’ అని పేర్కొన్నారు. ‘దేశ భవిష్యత్తు  మీ చేతుల్లో ఉంది. యువతరం దేశానికి తరగని సంపద. పరీక్షల్లో తప్పినంత మాత్రాన జీవితాలను అర్ధాంతరంగా ముగించకండి. మీపై పెట్టుకున్న కన్నవారి ఆశలను కడతేర్చి వారికి కడుపుకోత మిగల్చకండి’ అని సూచించారు. ‘మీ ముందు  బంగారు భవిష్యత్తుంది. ప్రపంచ చరిత్రలో విజేతలుగా నిలిచిన చాలామంది మొదట పరాజితులే. ఓటమి విజయానికి తొలిమెట్టు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ‘మంచి ఫలితాల  కోసం మళ్లీ కష్టపడి చదవండి. ఎప్పటికప్పుడు మీ నైపుణ్యాలను పెంచుకోండి. ఎంచుకున్న రంగాల్లో ప్రతిభ చూపి రాణించండి. కష్టపడితే విజయం మీదే. బంగారు భవిష్యత్తూ మీదే. జీవితంలో మీ ఎదుగుదలే తల్లిదండ్రులకు, దేశానికి మీరిచ్చే గొప్ప బహుమతి’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

Leave a Response