40రోజులు కష్టపడండి.. 60నెలలు పాటుపడతా

సిరిసిల్ల నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు గోదావరి జలాలను తెచ్చే కాళేశ్వరం ప్రాజెక్టు వద్దంటూ కాంగ్రెసోళ్లు కోర్టుల్లో 200 కేసులు వేశారని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. బుధవారం ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నాగంపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహాకూటమిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణం ఆపాలని కాంగ్రెసోళ్లు కేసులు వేస్తే.. ఏపీ సీఎం చంద్రబాబు దిల్లీకి 30 ఉత్తరాలు రాశారు. దొంగలు దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్నట్టు వారిద్దరూ ఈ రోజు తెలంగాణలో పొత్తు పెట్టుకున్నారు. ఆ రెండు పార్టీలూ ఒక్కటై తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నాయి. ఈ ఎన్నికలు మీ తలరాతలు మీరే రాసుకొనే ఎన్నికలు. మాయా కూటమి, మహాకూటమి, కాంగ్రెస్‌కు ఓటేస్తే మన కంటిని మనం పొడుచుకున్నట్టే. మన మరణ శాసనం మనమే రాసుకుంటామా? కరెంటు అడిగితే కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్‌ది. అడగకపోయినా 24గంటల పాటు రైతులకు విద్యుత్‌ ఇస్తూ కేసీఆర్‌ రైతు బంధువయ్యారు. అందువల్ల ఆలోచించి ఓటేయండి.. ఆగమాగమై ఓటేయొద్దు. డిసెంబర్‌లో కేసీఆర్‌ మళ్లీ సీఎం అయ్యాక ఎక్కడ పేదవాడికి జాగా ఉంటే అక్కడే రూ.5లక్షలతో ఇళ్లు కట్టించే బాధ్యత కూడా తీసుకుంటాం. గత మూడు ఎన్నికల్లో నాకు మద్దతుగా నిలిచారు. ఆశీర్వదించారు. ఈ సారి కూడా ఆశీర్వదించండి. డిసెంబర్‌ 7న ఎన్నికలు ఉన్నాయి. ఈ 40 రోజుల్లో నాకోసం కష్టపడితే.. వచ్చే 60 నెలలు మీకోసం పాటుపడతా. నాకు చేతనైనంతగా నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేశాను. ఆలోచించి ఓటు వేయండి.. ఆషామాషీగా ఓటు వేయొద్దు. కష్టపడి సాధించుకున్న తెలంగాణలో ద్రోహులకు పొరపాటున కూడా ఓటు వేయొద్దు’’ అని ప్రజలకు కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు.

Leave a Response