గర్జించిన భారత్‌ కెనడాను చిత్తు చేసి క్వార్టర్స్‌కు

హాకీ ప్రపంచకప్‌లో భారత్‌కు అద్భుత విజయం! అటు అటాకింగ్‌లోనూ, డిఫెన్స్‌లోనూ అదరగొట్టిన టీమ్‌ఇండియా కెనడాను 5-1 గోల్స్‌తో చిత్తు చేసి క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లింది,ఈ విజయంతో పూల్‌-సిలో ఏడు పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన భారత్‌.. బెల్జియంను పక్కకునెట్టి నేరుగా నాకౌట్‌కు అర్హత సాధించింది. శనివారం జరిగిన పూల్‌-సి మ్యాచ్‌లో భారత్‌ 5-1తో కెనడాను చిత్తు చేసి క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లింది. నేరుగా క్వార్టర్స్‌ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆరంభం నుంచి మన్‌ప్రీత్‌సింగ్‌ సేనదే ఆధిపత్యం. 12వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ గోల్‌గా మలిచి జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు. రెండో క్వార్టర్‌ ముగిసే సమయానికి భారత్‌ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. అయితే మూడో క్వార్టర్‌లో కెనడా ఆటగాడు ఫ్లోరిస్‌ వాన్‌సోన్‌ (39వ ని) గోల్‌ చేయడంతో స్కోరు సమమైంది. నాలుగో క్వార్టర్‌ కూడా మొదలవడంతో మ్యాచ్‌ డ్రాకు మళ్లుతుందా అనిపించింది. కానీ ఉన్నట్టుండి భారత ఆటగాళ్లు దూకుడు పెంచారు. కళ్లు చెదిరే పాస్‌లతో ప్రత్యర్థి శిబిరంపై దాడులు చేశారు. ఫలితం 11 నిమిషాల వ్యవధిలో నాలుగు గోల్స్‌! మొదట చింగ్లెన్‌సనా సింగ్‌ (46వ ని) గోల్‌ కొట్టి భారత్‌ను మళ్లీ ఆధిక్యంలోకి తీసుకురాగా.. లలిత్‌ ఉపాధ్యాయ్‌ (47వ ని) గోల్‌ కొట్టి ఆధిక్యాన్ని మరింత పెంచాడు. ఆ తర్వాత అమిత్‌ రోహిదాస్‌ (51వ ని) పెనాల్టీ కార్నర్‌ను సద్వినియోగం చేయడంతో భారత్‌ 4-1 ఆధిక్యంలో నిలిచింది. ఆఖర్లో లలిత్‌ (57వ ని) మరో గోల్‌ చేసి భారత్‌ను 5-1తో తిరుగులేని ఆధిక్యంలో నిలబెట్టాడు. ఈ విజయంతో పూల్‌-సిలో రెండు విజయాలు, ఒక డ్రాతో 7 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచిన భారత్‌ నేరుగా క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. బెల్జియం కూడా 7 పాయింట్లే సాధించినా.. భారత్‌ కన్నా తక్కువ గోల్స్‌ చేసిన కారణంగా రెండో స్థానంలో నిలిచి క్వార్టర్స్‌లో స్థానం కోసం క్రాస్‌ ఓవర్‌ ఆడనుంది. తన ఆఖరి పూల్‌ మ్యాచ్‌లో బెల్జియం 5-1తో దక్షిణాఫ్రికాను ఓడించింది.  ఈనెల 13న భారత్‌ క్వార్టర్స్‌ ఆడుతుంది. ప్రత్యర్థి తేలాల్సి ఉంది.

Leave a Response