ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తా…

 యాంగ్రీ స్టార్ రాజశేఖర్‌ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ‘కల్కి’. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత శుక్రవారం విడుదలై మంచి టాక్‌ అందుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో రాజశేఖర్ పాల్గొని చెప్పుకొచ్చిన ముచ్చట్లు..  సినిమాకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన లభిస్తోంది? 
రాజశేఖర్‌: నా నటనకు మంచి పేరు వచ్చింది. నా లుక్స్, మేనరిజమ్స్ బాగున్నాయని ప్రేక్షకులందరూ ప్రశంసిస్తున్నారు. కథ, నా క్యారెక్టర్, ప్రశాంత్ వర్మ టేకింగ్… అన్నీ బాగున్నాయని అంటున్నారు. కానీ కలెక్షన్స్‌ పరంగా నా సినిమాకు 60 మార్కులే పడ్డాయని చెప్పాలి. మేం పాసయ్యాం. కానీ వంద శాతం రాలేదు. ఇలా ఎందుకు జరిగిందని నేను కూడా సరిగ్గా ఆలోచించలేదు. ఇన్వెస్టిగేట్‌ చేస్తాను.   సినిమాలో మీ స్టైలింగ్ మీద చాలా శ్రద్ధ పెట్టినట్లున్నారు? 
రాజశేఖర్‌: పోలీస్ యూనిఫామ్ వేసుకోవాలి అని చెప్తే చాలు… నేను డైటింగ్ చేయడం, వర్కౌట్స్ చేయడం స్టార్ట్ చేస్తా. ఫిట్‌నెస్ మీద దృష్టి పెడతా. ఇన్‌ష‌ర్ట్‌ చేసుకుంటే పొట్ట కనిపించకూడదు. ఇందులో పోలీస్ క్యారెక్టర్ కావడంతో ముందు నుంచి జాగ్రత్త పడ్డాను.  మీ సినిమాలలో మీ క్యారెక్టర్ డామినేటింగ్‌గా ఉంటుంది. ఇందులో అండర్ ప్లే చేసినట్టున్నారు?
రాజశేఖర్‌: క్యారెక్టర్ పరంగా నేను డామినేట్ చేశానా? అండర్ ప్లే చేశానా? అనేది పక్కన పెడితే… ఈ సినిమాతో నాకు మంచి పేరు వచ్చింది. ఇంటర్వెల్ ఫైట్, క్లైమాక్స్, క్లైమాక్స్‌లో నా ఫైట్ బాగున్నాయని అందరూ చెబుతున్నారు. ముఖ్యంగా నా అభిమానులకు సినిమా చాలా బాగా నచ్చింది. ‘సార్… ఇప్పుడే రెండోసారి సినిమా చూశాం మళ్లీ వెళుతున్నాం’ చాలా మంది ఫోన్లు చేస్తుంటే… నాకెంతో సంతోషంగా అనిపిస్తోంది.  సినిమాలో మీకు నచ్చిన సన్నివేశం?
రాజశేఖర్‌: నేను ఉన్న ప్రతి సన్నివేశం నాకు బాగా నచ్చింది. చాలా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేశా. ఏం సెప్తిరి ఏం సెప్తిరి’ డైలాగ్‌ గురించి దర్శకుడు ప్రశాంత్ వర్మ వివరించినప్పుడు మీరు ఏమన్నారు?
రాజశేఖర్‌: సినిమాలో రెండుసార్లు ‘ఏం సెప్తిరి ఏం సెప్తిరి’ అనే డైలాగ్ చెప్తాను. దర్శకుడు ప్రశాంత్ వర్మ ఒక రోజు వచ్చి సన్నివేశాన్ని వివరించారు. ‘ప్రశాంత్! సన్నివేశాన్ని భలే రాశారే’ అన్నాను. ఆ రోజు షూటింగ్ చేసేశాం. రెండోసారి డైలాగ్ చెప్పే సన్నివేశాన్ని తీస్తున్నప్పుడు జీవిత సెట్‌కి వచ్చింది. తనతో ఆ డైలాగ్ గురించి చెప్పాను. ‘ఇది మీ డైలాగే కదా!’ అంది. (నవ్వుతూ) అప్పటివరకు నాకు అది నా డైలాగే అనే సంగతి కూడా నాకు గుర్తు లేదు. కమర్షియల్ ట్రైలర్ విడుదల తర్వాత ఆ డైలాగ్‌కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. థియేటర్లలో ప్రేక్షకులు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు.  విల‌న్‌గా చేయ‌డానికి సిద్ధమేనా?
రాజశేఖర్‌: నేను రెడీ. నేను విలన్ అయితే తట్టుకోలేరు. అందుకని భయపడుతున్నారేమో. ఉదాహరణకు… ‘ధృవ’లో అరవింద్ స్వామి చేసిన విలన్ క్యారెక్టర్ అయితే చేస్తా. రెగ్యులర్ విలన్ రోల్స్ చేయను. ‘అరవింద సమేత వీరరాఘవ’, ‘శ్రీమంతుడు’ చిత్రాల్లో జగపతిబాబు చేసిన పాత్రలు కూడా నచ్చాయి. అటువంటివి వచ్చినా చేస్తా. రాహుల్ రామకృష్ణ కోణంలో కథను చెప్పారు. ఎందుకలా?
రాజశేఖర్‌: స్క్రీన్‌ప్లేలో అదొక స్టైల్‌. హీరో ఇన్వెస్టిగేషన్ చేస్తే రొటీన్ అవుతుందని ఇలా ప్రయత్నించాం. రాహుల్ రామకృష్ణ కోణంలో కథ చెప్పడం వల్ల క్లైమాక్స్‌కు అంత పేరు వచ్చింది. కథ ఇలా చెప్పడం వల్ల చాలా మంది ప్రేక్షకులు ఎంతో థ్రిల్‌గా ఫీలవుతున్నారు. మీరు, బాలకృష్ణ కలిసి సినిమా చేస్తారనే వార్త వినిపిస్తోంది. నిజమేనా?
రాజశేఖర్‌: చాలా వినిపిస్తున్నాయి. చిరంజీవిగారు, నేను చేస్తామని కొందరు రాశారు. ఈ పుకార్లు ఎవరు సృష్టిస్తున్నారనేది తెలుసుకోవడానికి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తా (నవ్వులు).  మీరు చేయబోయే తర్వాతి సినిమా?
రాజశేఖర్‌: ఇంకా ఏదీ అనుకోలేదు. కథలు వింటున్నాం. ప్రవీణ్ సత్తారు ‘గరుడవేగ 2’ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారు. నెక్స్ట్ లెవల్‌లో ఉంటుంది. సినిమా చూసి మీ పిల్లలు ఏమన్నారు?
రాజశేఖర్‌: వాళ్లకు సినిమా బాగా నచ్చింది. పిల్లలు ఇద్దరూ మెచ్చుకున్నారు. అంతే కాదు, వాళ్ల స్నేహితులు సినిమా చూసి… ‘మీ నాన్నగారు యంగ్ హీరోలకు దీటుగా ఫైట్స్ చేశారు’ అని చెప్పారట. దాంతో మరింత సంతోషపడుతున్నారు. దర్శకుడు ప్రశాంత్ వర్మ లవ్ ట్రాక్‌ను కూడా చాలా బాగా డీల్ చేశారు. మీరు చూస్తే అందులో ఎక్కడా హీరో హీరోయిన్ మధ్య టచింగ్స్ ఉండవు. అదాశర్మతో నా జోడీ సూపర్‌గా ఉందని మా అమ్మాయిలు చెప్పారు.  దొరసాని’తో శివాత్మిక వెండితెరకు పరిచయమవుతున్నారు. తండ్రి, కుమార్తె కలిసి సినిమా చేసే ఆలోచన ఉందా?
రాజశేఖర్‌: ఉంది. అయితే ఇప్పుడు కాదు. పెద్దమ్మాయి శివాని కూడా కథానాయికగా పరిచయమైన తర్వాత చేస్తాం. నిజానికి ‘దొరసాని’ కంటే ముందు శివాని కథానాయికగా సినిమా మొదలైంది. అనుకోని కారణాల వల్ల ఆ సినిమా ఆగింది. అమ్మాయిలు ఇద్దరూ రెండు మూడు సినిమాలు చేసిన తర్వాత మేం కలిసి సినిమా చేస్తాం. అందులో జీవిత కూడా నటిస్తుంది. మా పిల్లలు ఇద్దరూ నాకో కథ చెప్పారు. చాలా బాగుంది. సి. కళ్యాణ్‌కి చెప్తే తానే నిర్మిస్తానన్నారు. కుటుంబ కథా చిత్రమది. నిన్న విడుదలైన ‘దొరసాని’ ట్రైలర్ చూసి శివాత్మికను అందరూ సావిత్రిగారితో పోలుస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. 

Leave a Response