తెలంగాణ సీఎల్పీ విలీనాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. సోమవారం ఉదయం దీక్ష కొనసాగిస్తున్న భట్టి విక్రమార్కను అరెస్టు చేసిన పోలీసులు.. ఆయన్ని అక్కడి నుంచి నిమ్స్కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులను అడ్డుకునేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించగా కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. సీఎల్పీ విలీనాన్ని నిరసిస్తూ ఈ నెల 8 నుంచి భట్టి విక్రమార్క ఆమరణ దీక్షకు దిగిన విషయం మనందరికీ తెలిసిందే.
నిన్న దీక్షా శిబిరానికి పలువురు కాంగ్రెస్ నేతలు, ఇతర ముఖ్యులు వచ్చి భట్టి మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా భట్టివిక్రమార్క మాట్లాడుతూ.. కేసీఆర్ మనస్తత్వం ఉన్న సీఎంలు నలుగురుంటే దేశంలో ప్రజాస్వామ్యం కనుమరుగై పోతుందని అన్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలని ఈ సందర్భం గా అయన డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎన్నికల సంఘాన్ని, రాష్ట్రపతిని కలుస్తామని భట్టి తెలియజేసారు.