ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ప్రియాంక గాంధీ వాద్రా సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. నిన్న ఉత్తరప్రదేశ్లోని ఫతేపూర్ సిక్రీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేపట్టేందుకు ఆమె చాపర్లో వెళ్లారు. అయితే ఆ చాపర్లో మహిళా పైలట్ను చూసిన ప్రియాంక ఎంతో ఆనందపడ్డారు. వెంటనే ఆమెతో సెల్ఫీ తీసుకుని సోషల్మీడియాలో పోస్టు చేశారు. ‘ఓ మహిళ నడిపిన లోహవిహంగంలో ఎక్కడం ఎంతో గర్వంగా ఉంది. అది కూడా చాపర్లో’ అని ప్రియాంక ట్వీట్ చేశారు.
రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నాటి నుంచి ప్రియాంక తన ఎన్నికల ప్రచారంలో మహిళా సమస్యలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. సాధారణంగా ఎవరైనా ప్రసంగాన్ని మొదలుపెట్టేముందు ‘భాయియో ఔర్ బెహినో సోదర సోదరీమణులారా ’ అని అంటారు. కానీ గతంలో ప్రియాంక తన తొలి రాజకీయ ప్రసంగాన్ని ‘బెహనో ఔర్ భాయియో సోదరీ, సోదరుల్లారా’ అని ప్రారంభించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా అటు అధికార భాజపాపై కూడా ప్రియాంక విమర్శలు గుప్పిస్తున్నారు. నిన్న ఫతేపూర్ సిక్రీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ భాజపాపై విరుచుకుపడ్డారు. ఎన్నికల ప్రచారంలో పాకిస్థాన్ గురించి కాకుండా, భారత్కు ఏం చేశారో వివరించాలని హితవు పలికారు.