ఆ రూ.2,636కోట్లు రికవరీ చేయండి: ఏపీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డి

పీజే అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్‌ కొనుగోళ్ల వ్యవహారంపై సీఎం జగన్‌ దృష్టి సారించారు. విద్యుత్‌, ఇంధనశాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించిన పలు అంశాలపై అధికారులకు ఆయన సూచనలు చేశారు. సోలార్‌, పవన విద్యుత్‌ కొనుగోళ్లపై ఆయన విస్తృతంగా చర్చించారు. బిడ్డింగ్‌ ధరల కన్నా అధిక రేట్లకు ఎందుకు కొనుగోలు చేశారని అధికారులను సీఎం జగన్ ప్రశ్నించారు. ఈ అక్రమాలతో ప్రభుత్వ ఖజానాకు సుమారుగా రూ.2,636 కోట్ల నష్టం కలిగిందన్నారు. ఆ డబ్బును రికవరీ చేయాలని అధికారులకు సీఎం జగన్‌ ఆదేశించారు.

సోలార్‌, పవన్‌ విద్యుత్‌ సంస్థలతో తిరిగి సంప్రదింపులు జరిపేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేశారు జగన్ . సౌర, పవన విద్యుత్‌ సంస్థలు దారికి రాకపోతే ఒప్పందాలు రద్దు చేయాలని ఆయా అధికారులకు సూచించారు. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్‌ ఒప్పందాలు చేసిన ఉన్నతాధికారి, అప్పటి మంత్రి, సీఎంపై చట్ట మరియు న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ అంశంపై కేబినెట్‌ సబ్‌ కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. ఈ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఇకపై విద్యుత్‌ ఒప్పందాలు పూర్తి పారదర్శకంగా ఉండాలన్నారు. ఈ మేరకు మొత్తం 30అంశాలపై విచారణ చేస్తామని జగన్‌ ఈ సందర్భముగా ఆయన స్పష్టంచేశారు.

రైతులకు పగటిపూట 9 గంటల విద్యుత్‌ రేపటి నుంచే!

ఇచ్చిన హామీ మేరకు రైతులకు 9గంటల నిరంతరాయ విద్యుత్ సరఫరా అమలుకోసం సత్వరమే చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో లోపాలకు తావులేకుండా చేయడం సహా వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అయన అన్నారు. రేపటి నుంచి 60 శాతం ఫీడర్లలో వ్యవసాయ పంపు సెట్లకు 9 గంటలపాటు పగటిపూట విద్యుత్‌ అందించాలని సీఎం ఆదేశించారు. మిగిలిన 40శాతం ఫీడర్లకు రూ. 1700 కోట్ల రూపాయలు విడుదల చేయనున్నట్లు ఈ సందర్భముగా సీఎం జగన్‌ తెలిపారు. ఫీడర్లలో పనులు వేగంగా పూర్తిచేయాలని.. 2020 జులై 30 నాటికి మిగిలిన 40 శాతం ఫీడర్ల కింద 9 గంటలపాటు విద్యుత్‌ ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు ఏపీ సీఎం జగన్ .

Leave a Response